⁂
No transcript for this section.
Transcript begins at 0:00.
[ఇంట్రో మ్యూజిక్] దేవీ నవరాత్రులలో శరన్నవరాత్రులలో విజయదశమి అంటే ఇది పదవ రోజు. ఎనిమిది అష్టమి, తొమ్మిది నవమి, పది దశమి. ఈ దశమి మామూలు దశమి కాదు. ఇది విజయదశమి. ఎందుకని అంటే దుర్గాష్టమి నాడు దుర్గముడ్ని జయించినటువంటి, సంహారం చేసినటువంటి దుర్గాదేవిని ఉపాసన చేశాం. మహర్నవమి నాడు మహిషాసురుడ్ని మర్దనం చేసినటువంటి అమ్మవారిని ఉపాసన చేశాం. అంటే మన మీద మనం ఒక సాధికారమైనటువంటి విజయాన్ని సాధించాలి. నిజానికి విజేత ఎవరు అని? పరాయి వాడి మీద, పక్క వాడి మీద ఒక విజయం సాధిస్తే వాడు విజేత కాడు. ఒక మంచి ఆటగాడు, అంతే. మరి విజేత ఎవరు? తనను తాను జయించిన వాడు విజేత అవుతున్నాడు. తనను తాను జయించినటువంటి సందర్భమే విజయదశమి. రావణ సంహారం అయిన తర్వాత శ్రీరామచంద్రుడు జగత్తులో ధర్మసంస్థాపన చేసి సనాతన ధర్మమైన, వైదికమైన, ఆర్షమైన భారతీయ ధర్మాన్ని మళ్ళీ దానికి పట్టం కట్టి పట్టాభిషిక్తుడైనటువంటి మహత్తరమైనటువంటి రోజే విజయదశమి. ఆయన అయోధ్యకి తిరిగి వచ్చినటువంటి రోజు. ఇది రామాయణ పరమైనటువంటి భావన. అయితే దసరా, శరన్నవరాత్రులని దసరాలు అని కూడా అంటాం. ఏమిటి ఈ దసరా అని ఆలోచించినట్లయితే, ద అంటే మళ్ళీ దుర్గాదేవి, స అంటే సరస్వతీ దేవి, ర అంటే రమాదేవి. మూడు శక్తులు, మూడు మూర్తులు, మూడు బొమ్మలుగా కనిపిస్తున్న ఇది ఒక త్రిపుటి, దసరా. దుర్గాదేవి, శారదాదేవి లేదా సరస్వతీ దేవి, రమాదేవి. మరి దుర్గాదేవి కోకిల కామిని మధుర కూజిత కోమల వాయువీచి అటువంటి కాలమిది, శరత్కాలం. కోకిలలు కూసినయ్, ఇవన్నీ అవుతున్నాయ్ నెమ్మదిగా మధురమైనటువంటి, మంజులమైనటువంటి భావనలో చలచల్లని వేళలో అమ్మవారిని గురించి మనం ఉపాసన చేసుకున్నప్పుడు ముందుగా మనం దసరాల్లో దుర్గాదేవిని గురించిన విచారణ అది పూర్తి కాలేదు నిజానికి. ఈ దుర్గాదేవి ముగ్గురమ్మలలో ఒక ప్రధానమైనటువంటి భాగం. ఆ శక్తి [గొంతు సవరించిన శబ్దం] ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి రెండూ కూడినది. సకారాత్మకమైనటువంటి స, సరస్వతీదేవి ఆమె జ్ఞానశక్తి. ఈ రెండింటికీ షడైశ్వర్యములలో ప్రధానమైనటువంటి విభూతి ఏదైతే ఉన్నదో ఆ షడైశ్వర్య స్వరూపిణి అయినటువంటి రమాదేవి, లక్ష్మీదేవి మూడవ స్థాయి. మూడింటినీ గనక సమన్వయం చేసుకున్నట్లయితే విజయము తజ్జము అని చెప్పేదే, దాని పేరే దసరా. దసరా కాదండి, మేము దీనిని సరదాగా గడుపుతున్నాం అంటే మళ్ళీ అవే అక్షరాలున్నాయ్. స అంటే సరస్వతీదేవి, ర అంటే రమాదేవి, ద అంటే దుర్గాదేవి. ఈ మూడింటినీ చూసుకున్నట్లయితే నిజానికి కోటి సూర్యమండల మధ్యస్థ అయినటువంటి మహా త్రిపురసుందరి దేవి కలియుగం ఆరంభం వేళలో ముప్పై ముక్కోటి దేవతలు, త్రిమూర్తులు, అష్టదిక్పాలకులు, నవగ్రహాలు, కుబేరుడు, అగస్త్యుడు, లోపాముద్ర వీళ్ళందరూ వెళ్ళి "అమ్మా! బ్రహ్మకి అవతారాలు లేవు కదా. విష్ణువుకి అవతారాలు ఉన్నాయి, అవి ఇరవై యొక్క అవతారాలు. అందులో అవి అయిపోయినాయ్. ఇరవై రెండులో ఇరవై ఒకటి అయిపోయినాయ్. ఇంకా ఒక్కటే మిగులుంది, అది ఎప్పుడో కలియుగాంతంలో వస్తుంది. శివుడికి పూర్ణావతారంగా వచ్చే అవకాశం లేదు. ఎప్పుడైనా విష్ణువు ఒక అవతారాన్ని తీసుకుని వస్తే, ఆయన ఇబ్బందుల్లో పడితే కాసేపు వచ్చి అంటే అర్చా మూర్తిగా ఆ క్షణానికి వచ్చి వ్యూహా స్వరూపమైనటువంటి అవతారంగా, వ్యూహం కూడా ఒక అవతారమే అలా వస్తాడు. మరి కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఉంది కదా, మరి ఎట్లా దీన్ని ఎవరు అధిష్టాత? బ్రహ్మ రాడు, శివుడు రాడు, విష్ణువు రావటానికి ఆయన చేయవలసినది ఇప్పటికే అయిపోయింది కదా" అంటే "కోటి సూర్యమండల మధ్యస్థయై-అయిన నేను మహా త్రిపురసుందరి దేవి నేనే అధిష్టాతగా వస్తాను కలియుగానికి" అన్నది. వీళ్ళందరూ ఆశ్చర్యపోయినారు. కోటి సూర్యమండలాలలో ఉన్నటువంటి అమ్మవారు దేశంలోకి, ప్రపంచంలోకి వస్తే ఈ ప్రపంచం భస్మీపటలమైపోతుంది కదా అంటే అప్పుడు ఆమె దయతో, కరుణతో, అనుగ్రహంతో, అనుకంపతో ఒక మాట ఏమన్నది అంటే "వస్తే ఇలా వస్తాన, శ్రీ లలితాదేవిగా వస్తాను నేను". శ్రీ లలితాదేవి. వచ్చి "కలియుగాన్ని నేను నడిపిస్తాను, మీరు చక్కగా విశ్రాంతిగా ఉండండి, ధైర్యంగా ఉండండి. ఈ ఎంత సేపు ఈ నాలుగు లక్షల ముప్పై రెండు వేలు అయిపోతాయి" అని ఆమె సమాధాన పరిచింది. అయితే ఈ శ్రీ లలితాదేవిగా వచ్చింది కనుకనే కలియుగంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే శ్రీ లలితా ఉపాసన ప్రధానమైంది ఇవాళ. అగస్త్యుడు, హయగ్రీవుడు వాళ్ళు కూర్చొని అమ్మవారి యొక్క అనేకమైనటువంటి ఆవరణలను వర్ణిస్తూ ఆమె శక్తిని, ఆమె కుటుంబాన్ని, ఆమె కుటుంబాన్ని, ఆమె ఆభరణాలని అన్నీ వర్ణిస్తూ వస్తే అది లలితా సహస్రమైంది. ఈ లలితా సహస్రంలో అవి మామూలుగా మనం పారాయణం చేస్తాం, చాలా ఆనందం పొందుతూ ఉంటాం. కానీ దానిలో మార్మికమైనటువంటి ఒక మూల ఉన్నది. విజయదశమి నాడు మనం చేయవలసింది అది. అది ఏమిటి అంటే డెబ్భై ఒకటవ శ్లోకం వచ్చేదాకా లలితా సహస్రనామం అంతా కూడా ఆవరణ వర్ణన, అమ్మవారి వర్ణన. పరివారం, గుర్రాలు అవి, ఇవి అన్నీ కూడా.ఇక్కడికి వచ్చేసరికి డెబ్బై ఒకటవ శ్లోకంలో రాజ రాజార్చిత రాజ్ఞి రమ్య రాజీవ లోచన రంజని రమణి రస్యా రణత్కింకిణి మేఖలా అనేటువంటిది చాలా కీలకమైనటువంటి మంత్రం ఇది. ఆ నామాలు. దీనికి మూల మంత్రం ఏదన్నా ఉన్నదా? దీనికి పేరు ఏమిటి? లలితలో మరొక పేరు ఏదన్నా ఉన్నదా అంటే ఇదిగో ఇక్కడికి వచ్చేప్పటికి అమ్మవారి పేరు భువనేశ్వరి. అంటే ఈ భువనమునకు ఆమె ఈశ్వరి. ఈశ్వరి అంటే రెండు అర్థాలు. తల్లి అని ఒక అర్థం. ఈశ్వరీ అంటే సర్వ శక్తులు సర్వ ఐశ్వర్యాలు సమకూర్చగలిగినటువంటి శక్తివంతమైనటువంటిది గనుక భువనేశ్వరీ దేవి అవుతున్నది. ఈ భువనేశ్వరీ మంత్రం ఏమిటి అంటే జగజ్జనానందకరీం జయాఖ్యాం యశస్వినీం యంత్ర సుయజ్ఞయోనీం జతామితా మిత్రకృత ప్రపంచాం భజామహే శ్రీ భువనేశ్వరీం తాం అనాలి. అంటే ఏమిటయ్యా ఎవరు ఈ అమ్మవారిని మనం ఇక్కడ ఎలా ఉపాసన చేసుకోవాలి అనంటే జగజ్జనానందకరీం. జగత్తుకి జనానికి ఆనందాన్ని మాత్రం ఇస్తుంది. సుఖం వేరు, సంతోషం వేరు, ఆనందం వేరు. సుఖం దేహ పరం. సంతోషం మనసుకు పరం. ఆనందం హృదయానికి సంబంధించింది. ఈ ఆనందం మనుష్యానందము, మనీషానందము, గంధర్వానందము, మానవ గంధర్వానందము, దేవ గంధర్వానందము, పితృ పితా నందము, ప్రజాపితా నందము, హిరణ్యగర్భానందము అదే పరమ చరమమైన బ్రహ్మానందముగా ఉన్నది గనుక ఈ బ్రహ్మాందాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తి ఎవరికి ఉన్నది అంటే భువనేశ్వరీ దేవికి ఉన్నది. కనుకనే జగజ్జనానందకరీం. యశస్వినీం. ఒక కీర్తితో ఉన్నది. ఆ కీర్తి ఎటువంటిది అంటే ఆ ఆకాశమంతా పరచుకున్నటువంటి ఒక పండు వెన్నెల వలె అమలినంగా ఉన్నది. కానీ ఈమెకి దీనితో పాటుగా ఇంతకు భువనేశ్వరీ దేవితో పాటుగా మరొక పేరు ఉన్నది. ఆ పేరు ఏమిటంటే జగజ్జనానందకరీం జయాఖ్యాం. జయా అనబడే ఆఖ్యాం, ఆఖ్యాం అంటే పేరు. జయా అనే పేరుతో పిలవబడుతూ ఉంటుంది. ఆ జయ అందుకనే ఇది విజయదశమి అయింది. ఆ జయతో కూడిన విశిష్టమైన, వరిష్టమైన, గరిష్టమైన, తృప్తికరమైన, పుష్టికరమైన, సంతృప్తికరమైన ఎవరు అధిగమించడానికి వీలు లేనటువంటి ఒక సమున్నతమైనటువంటి స్థాయిలో ఉంటుంది గనుక ఆ అమ్మవారు జగజ్జనానందకరీం జయాఖ్యాం. ఆమెని జయా అని కూడా పిలవవచ్చు. అది కూడా చాలా అత్యద్భుతమైనటువంటి నామం. యశస్వినీం. కీర్తి ఉన్నది ఆమెకి. ఆ కీర్తి ఇందాక అన్నట్లుగా పండు వెన్నెల ఎట్లా పౌర్ణమి నాడు అనేక పౌర్ణమి ఆమాలికలు సుషుమ్నా కిరణాలై చంద్రమండలం నుంచి భూమండలం మీదికి ఎట్లా జాలువారుతూ ఉన్నాయో, ప్రవహిస్తున్నాయో, దారాలు కట్టి ఉన్నాయో అటువంటి కీర్తి ఉన్నది. ఎక్కడా మాలిన్యం లేదు, మచ్చ లేదు. ఎక్కడా అలజడి లేదు. ఏ రకమైనటువంటి విభిన్నమైనటువంటి స్థితులు లేవు. అటువంటి యశస్వినీం. యంత్ర సుయజ్ఞ యోనీం. ఈ ప్రపంచం అంతా మంత్రాత్మకము, తంత్రాత్మకము, యంత్రాత్మకము. మంత్రము అంటే మాట. తంత్రము అంటే వ్యూహం. యంత్రము అంటే నడక. మన శరీరం ఒక బొమ్మ. కీలు బొమ్మ. ఇది యంత్రంలా నడుస్తూ ఉంటుంది. నడిపించేవాడు ఎవడో మనకు తెలియదు. కానీ లోపల ఉన్నాడు వాడు. ఎవడు? పంచభూతములు దివాకరుండు నిశాకరుడు నీ తను సప్తకంబ యేని ఈ శరీరంబు నీదే. కన్నుమూయుట కన్ను విప్పుట నీవు కలుగకెట్లు. ఏతత్ అధిష్టాత ఎవడో యజమానుడనిన అష్టమ తనువు వాడు. ఆ వాడు ఎవరంటే మనలో ఉన్నాడు. వాడు ఆత్మ స్వరూపుడై ఉన్నాడు, వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు మన యందే ఉన్నది గనుక ఆ వెలుగు ద్వారా మనం ఈ ప్రపంచంలో ఉన్న వస్తువులను చూడగలుగుతున్నాం. సూర్యున్ని చూస్తున్నాం, చంద్రున్ని చూస్తున్నాం. సూర్యుడి వలన చూస్తూ ఉన్నాం. కానీ సూర్యున్ని కూడా చూస్తున్నాం. చంద్రుడి వలన చూస్తున్నాం రాత్రుల్లో. కానీ చంద్రున్ని కూడా చూడగలుగుతున్నాం. అంటే ఎక్కడో కొన్ని లక్షల మైళ్ళ దూరంలో ఉన్న సూర్యబింబాన్ని, చంద్రబింబాన్ని ఈ కన్ను చూడగలుగుతున్నది అంటే చూపించేవాడు ఎవడో లోపల ఉన్నాడు. ఆ లోపల ఉన్నటువంటిదే యంత్రము. దానికి వాక్కు తోడైతే అది మంత్రము. వ్యూహం గనుక ఉన్నట్లయితే, వ్యూహము అంటే కాల కార్య కారణ కర్తవ్య నిమిత్తమై వస్తే దాని పేరు వ్యూహము. ఆ వ్యూహం అంటే ఆ రచన చేస్తాం. ఇది ఇలా జరగాలి, ఇది ఇలా చెప్పాలి, ఇది ఇలా ఉండాలి, ఇది ఇలా తినాలి, ఇది ఇలా సంపాదించాలి. ప్రతిదీ వ్యూహమే. ఇలా జీవించాలి లేదు ఇలా మరణించాలి. అంతా వ్యూహమే కాబట్టి వ్యూహాత్మకమైనటువంటి మానవ జీవితానికి లోపల యంత్రాత్మకమై వెలుగై పెను వెలుగై లోపల వెలుగుతున్న విరాజమానమవుతున్నటువంటి ఆ తల్లి మన యందున్నది గనుక భువనేశ్వరీ దేవి మన యందు వెలుగై ఉన్నది. వెలుగు మరొక్క పేరు అఖిల విద్యలకున్ పరమార్థ భూతమై. వెలుగులు తన్ను మించి మరి విశ్వమునందున వేరు చోట లేవు. అలఘుడు శిష్యవత్సలుడు అంబుధి శోషణ దాహమూర్తికిన్ వెలుగుల నిధికిన్ గురూత్తమునకున్ జగదక్షునకున్ నమస్కరించెదన్. అటువంటి ఆ గురువు లోపల ఉన్నాడు. గురువు అంటే పాఠం చెప్పినవాడా? మంచి మాట చెప్పినవాడా అంటే అంతరంగము కన్న జాపకుడు లేడు. అరయ కాలమే మీకు పరమ గురువు. పరమ గురువు ఎవరంటే కాలమే. కాలం మనకు ఎన్నో నేర్పుతుంది. ఆనందం అంటే ఏంటో చెబుతుంది, దుఃఖం అంటే చూపిస్తుంది. అనేక విషయాలు ఇవన్నీ కూడా దీనికి మూలమైనటువంటి శక్తి ఎవరు అంటే అమ్మవారి లోపల ఉన్నది. కాబట్టి యంత్రైః సుయజ్ఞయోనిం జితా మితా మిత్రకృత ప్రపంచాం. జితా జయించబడిన అమితమైనటువంటి మిత్రులని, జయించబడినటువంటి శత్రువులని అంటే అందరూ మిత్రులే ఉండేటువంటి ఒక ప్రపంచాన్ని ఇవ్వగలిగినటువంటి భువనేశ్వరీ దేవి భజామహే నిన్ను భజిస్తున్నా శ్రీ భువనేశ్వరీం తాం అని మనం ఉపాసన చేసుకుంటున్నట్లయితే ఈ దుర్గాదేవి, సరస్వతీదేవి, రమాదేవి చూడండిదుర్గాదేవి అంటే శక్తి. ఇచ్ఛా, క్రియా, జ్ఞాన శక్తులు. సరస్వతీ దేవి అంటే వాక్కు, వాంగ్మయం, సంగీతం, సాహిత్యం, సంస్కారం, సంస్కృతి. ఇదంతా సరస్వతీ దేవి యొక్క ఉపాసన. శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ ఫణీశ కుందమందార సుధాపయోధి శ్వేత తామర సామర వాహిని శుభాకార తనుప్పు నిన్ను మదిగానగ ఎన్నడు తలంతు భారతీ. మనం శాస్త్రం చదవచ్చు, వేదం చదవచ్చు, పుస్తకాలు చదవచ్చు, ఎన్నో మాటలు మాట్లాడొచ్చు, చెప్పొచ్చు, పాడొచ్చు, కూడొచ్చు, వీడొచ్చు కానీ వీటన్నింటికీ మూలం ఎవరంటే సరస్వతీదేవి, శారదాదేవి లేదా వాణి. వాణి అంటే వాక్కు అని అర్థం. కాబట్టి ఆవిడ ఉండాలి మనకి. బాగా చదువు ఉంది, బాగా జ్ఞానం ఉంది కానీ రమాదేవి లేదు, లక్ష్మీదేవి లేదు. అందుకనే భాగవత ప్రమాణం ఒకటుంది. భాగవతంలో శ్రీహరి అంటాడు, అంటే విష్ణుమూర్తి, నేను ఎవరినైతే నా భక్తుడు అని నేను నిర్ణయించుకున్నానో నేను చేసేటువంటి మొట్టమొదటి పని వాడి సిరిని నేను హరిస్తా. అంటే వాడికి డబ్బులు లేకుండా చేస్తా. అయ్యో అటువంటి విష్ణువు మనకెందుకు అనుకుంటాం. ఎందుకంటే విష్ణువుని వీడి, హరిని వీడి సిరి ఉండదు. సిరిని పట్టుకుంటే హరి ఉంటాడో ఉండడో తెలియదు. కానీ హరిని పట్టుకున్నట్లయితే హరితో కూడిన సిరి. జ్ఞానము ఉండాలి, విజ్ఞానము ఉండాలి, ప్రజ్ఞానం ఉండాలి, సుజ్ఞానం ఉండాలి, ధనము కూడా ఉండాలి. ఎందుకంటే డబ్బు ఎప్పుడూ కూడా పాపిష్టిది కాదు. కానీ పాపిష్టి వాడి చేతిలో డబ్బు ఉండకూడదు. ఇటువంటి విజయానికి దారి తీసేటువంటి అనేకమైనటువంటి మార్గాలను మనకు సూచిస్తూ, నీవు జన్మ ఎత్తి వచ్చినందుకు ఈ దసరా అనబడేటువంటి ఈ మూడు రోజులలో దుర్గాదేవిని శక్తి స్వరూపిణిగా ఆధారం చేసుకొని నీవు శక్తివంతుడివిగా. అలాగే కేవలం మానవ జన్మ కాదు నీది, ఉదాత్తమైనటువంటి మానవ జన్మ. సంస్కారవంతమైన జీవితాన్ని నువ్వు గడపాలి. వాక్కు స్పష్టంగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, శుచిగా ఉండాలి, అందరికీ హితకారిణిగా ఉండాలి. కనుక అమ్మవారైనటువంటి సరస్వతీదేవిని విశుద్ధ చక్రంలో అంటే కంఠస్థానంలో నిలబెట్టుకొని సరళమైన సం-- గంభీరమైనటువంటి, ఉదాత్తమైనటువంటి భాషా ప్రవాహాన్ని ప్రపంచానికి ఇవ్వాలి. అలాగే నీ సర్వశక్తులు ఒడ్డి సంపదను సృష్టించాలి, అపార సంపదను సృష్టించాలి. దానిలో నుంచి అమిత భాగాన్ని సమాజం కోసం, సత్కర్మల కోసం, సదాచారం కోసం, సంస్కృతి కోసం, స్వీయ ఉద్ధరణ కోసం ఖర్చు పెట్టాలి. కొంత జీవితానికి ఖర్చు పెట్టాలి. కొంత రేపటి కోసం దాచాలి అని చెప్పేటువంటి ఈ విజయ సూత్రాలన్నింటికీ కూడా ఒక వైజయంతీకా మాలిక ఏది అంటే అది విజయదశమి గనుక రాముడు ఒక రావణ సంహారం చేయటానికి మాత్రమే ఈ జగత్తులోకి రాలా. దశరథుడి ఇంట పుట్టి, దశకంధరుడి కుత్తుకలు ఉత్తరించి, దశయుగాల వరకు శ్రీరామనామం నిలబడేట్టుగా తన జీవితాన్ని "రామో విగ్రహ్వాన్ ధర్మః" అనిపిస్తూ వచ్చినటువంటి ఆ రాముడు లలితాదేవి కంటే భిన్నం కాదంటారు శంకర భగవత్పాదులు. "శ్రీరామో లలితాంబికే" అంటారు. ఏమి నాకు శ్రీరాముడికి లలితకి తేడా తెలియలేదు అంటున్నారు. అంటే మనం కూడా భౌతిక, ఆదిభౌతిక, ఆధ్యాత్మిక అంటే physical, metaphysical, spiritual. ఈ మూడు స్థాయిల్లో అత్యున్నతమైనటువంటి ఆధ్యాత్మిక స్థితికి వెళ్ళటానికి ఇదిగో అష్టమి, నవమి, ఖడగ, దశమి. ఆ దశమిలో మనం గనుక మన మీద మనం మనల్ని జయించుకోగలిగినట్లయితే, మనలో ఉన్న అంతర్గత శక్తులు అన్నింటినీ జయించగలిగితే మనం విజేతలు అవుతాం. అటువంటి ప్రతి దశమి విజయదశమి కావాలని, విజయదశమి పరమార్థం శమి పూజ ఒక్కటే కాదు, ఏదో అది పూర్ణాహుతి కాదు. మళ్ళీ పునః కొత్త రూపానికి, కొత్త కాలానికి తెరలేపేటువంటి మహా సన్మంగళ వేళగా నేను భావిస్తూ శక్తి స్వరూపిణి అయినటువంటి జగజ్జనునికి ప్రణామం చేస్తూ శుభం. [అవుట్ర్రో మ్యూజిక్]