⁂
No transcript for this section.
Transcript begins at 0:00.
జన్మాద్యతీతా నికియంతి మేహో ఉచావచత్వం యదభూత్ సుఖదుఃఖ హేతోః ఆజీవదాస్ తమతాం అభివద్య పుణ్యాత్ బాలే తదీయ కరుణా మమ సుప్రభాతం. మహర్నవమి, మహానవమి ఈ రెండు ప్రధానమైనటువంటివి. ఈ తొమ్మిది రోజులలో అష్టమి తర్వాత నవమి తొమ్మిదవ రోజు తొమ్మిది నిజానికి భారతీయ సంఖ్యా శాస్త్రంలో కట్టకడపటి అంకె. దాని తర్వాత ఇంకా ఏమీ లేదు. ఒకటి బ్రహ్మము అది ఆది, అంత్యము తొమ్మిది అవుతున్నది గనుక దీనికి మహానవమి, మహర్నవమి అని పేరు పెట్టుకున్నాం. మరి ఈ మహానవమి నాడు అమ్మవారు శక్తి స్వరూపిణి అయినటువంటి, దశ రూపిణి అయినటువంటి అమ్మవారు ఏం చేసింది? ఎందుకని మహర్నవమి అయింది? కాస్త విచారణ చేయాలి. ఎందుకని అంటే అనేకమైనటువంటి రాక్షసులు అన్ని కాలాలలో మానవుడిలో ఎట్లాగైతే మంచి చెడు కలబోతగా ఉన్నదో, సమాజం ఎట్లాగైతే మంచి చెడుల కలబోతగా ఉన్నదో, సృష్టి ఎట్లా మంచి చెడుల కలబోతగా ఉన్నదో అది కాలానికి, యుగానికి సంబంధించింది మాత్రమే కాదు. పౌరాణిక వాఙ్మయంలో మహిషాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడ్ని అమ్మవారు సంహారం చేసినటువంటి ఆ నవమి. కనుక ఇది మహర్నవమి అయింది. పురాణ గాథ ఎట్లా ఉన్నా అది ఎలాగూ అందరికీ తెలుసు గనుక. ఈ మహిషాసురుడు అనబడేటువంటి వాడు ఎవరు? వాడి స్వరూపం ఏమిటి? అంటే మహిషము ఒక జంతువు. బుద్ధి శూన్యత, అహంకారము, దంభము, గర్వము, ప్రగల్భము, అతిశయము, అభిజాత్యము ఇవన్నీ కలిసి ఉన్నటువంటి ఒకానొక వ్యక్తి సమాజానికి అహితకారి అయినప్పుడు, సమాజాన్ని శాసిస్తున్నప్పుడు, సమాజాన్ని అల్లకల్లోలం చేస్తున్నప్పుడు ఇదిగో ఈ మాతృమూర్తి అయినటువంటి మహా త్రిపుర సుందరి దేవి బాలగా, అందుకే బాలే త్వదీయ కరుణా మమ సుప్రభాతం అనుకున్నాం. అంటే ఈ బాల రూపంలో వచ్చినటువంటి ఈ అమ్మవారు ఈ నవమి నాడు మహిషాసుర మర్ధినిగా మర్ధనం చేసింది వాడిని. సంహారం చేసింది. అసుర మర్ధనం చేసింది. అసురీ భావాన్ని కకావికలం చేసింది. వాడికి మరణం అంటే ఏమిటో, వాడి వలన జాతి ఎంత ఇబ్బంది పడిందో ఆ ఇబ్బంది అంతా కూడా వాడికి మరణం ద్వారా శాసనం చేసి వాడు మరణించే దాకా ఆ యాతననంతా కూడా వాడు అనుభవించేట్లుగా చేసింది. దాన్- అందువలనే మర్ధనం చేసింది అని అన్నాం. అందుకని ఈ మహిషాసుర మర్ధని అనేటువంటిది ఒక సాంకేతికమైనటువంటి శబ్దంగా మనం భావన చేసినట్లయితే మనలోనే ఉన్నటువంటి ఒక దుర్గ, మనలోనే ఉన్నటువంటి ఒక అమ్మవారు, మనలోనే ఉన్నటువంటి ఒక శాక్తేయ స్వరూపిణి ఏం చేయాలి అనంటే ఉపాసనా విధివిధానాల ద్వారా ధ్యాన, ధారణ, అతీత స్థాయిలలో మనస్సును నిబ్బరం చేసుకొని చెడు ఆలోచనలు, చెడు తలపులు, చెడు భావనలు, చెడు భావములు, చెడు చేతలు ఇవేమీ లేకుండా తాను జన్మ ఎత్తి ఎందుకు వచ్చాడో ఒక జంతువుగా వస్తే జంతువులే ప్రవర్తించాలి, మానవుడిగా వస్తే మానవుడిగా ప్రవర్తించాలి, దైవతంగా వస్తే దైవతంగా ప్రవర్తించాలి. ఈ ప్రవర్తనలన్నీ కూడా సహజమైనటువంటి ఒక సంస్కారానికి, సంస్కృతికి లోబడి నడుస్తూ ఉంటాయి గనుక ఈ మహిషాసురుడు మన యందు కూడా ఉన్నాడని మనం అనుకోవాలి. ఆ మహిషము మనలో ఉన్నటువంటి ఆ మాలిన్యము, మనలో ఉన్నటువంటి దౌర్జన్యము, మనలో ఉన్నటువంటి లెక్కలేనితనము అచ్చ తెలుగులో. వీటన్నింటినీ కూడా మనంతట మనమే ఒక శక్తిని కూడా తీసుకుని మనం ఎప్పుడూ అనుకునే ఇచ్ఛ, క్రియా, జ్ఞాన శక్తులు అనుకుంటాం కదా. ఇచ్ఛ ఉండవచ్చు గాక కానీ అది క్రియా రూపంలో గనక రాకపోయినట్లయితే ఆచరణ శూన్యం కాని ఆలోచన బలహీనమైనది, శక్తిహీనమైనది, నిర్వీర్యమైనది, ఎవరికీ అక్కరకు రానిది కాబట్టి లోపల ఉన్నటువంటి ఆలోచనలన్నింటినీ కూడా సమన్వయం చేయాలి, సంఘటితం చేయాలి. సంఘటితం చేసి సమన్వయం కూడా చేసినట్లయితే వివేక విచక్షణలు అనబడేటువంటి రెండింటి ద్వారా మనలో ఉన్నటువంటి ఆ మహిషని మర్ధనం చేసుకోవాలి. ఇది ఎప్పుడు జరగాలి, ఎలా జరగాలి అంటే దానికి ధ్యానము, ధారణము, అతీత చారణము, విచారణము, సంచారణము, కడగా తారణము. తరణం అంటే ముక్తి. మనమంతా కూడా ముక్తిని కోరి వచ్చాం. అన్ని శబ్దాలు పుట్టని శబ్దమందు, అన్ని యుగాలు మొదలాయ యోగమందు, అన్ని జన్మల చివరాయ నరజన్మ, అరయ నారాయణాన్వేషితమ్ము. మనలో ఉన్నటువంటి నారాయణున్ని మనం చూసుకోవాలి. నరవేషంలో వచ్చాం మనం. నారాయణుడు లోపల ఉన్నాడు. లోపల ఎలా ఉన్నాడు? తెలియదు. ఎలా ఉన్నాడో తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మనస్సుని నిబ్బరం చేయాలి. మనస్సును నిగ్రహించాలి. నిగ్రహానికి ప్రతిమా ఈశ్వరః అని చక్కగా విగ్రహ పూజ చేయాలి. అంటే విగ్రహ పూజ దేనికి? విగ్రహ ఆరాధన దేనికి? అనంటే మనో నిగ్రహం కోసమే విగ్రహ ఆరాధన. విగ్రహ అర్చన, విగ్రహ అలంకరణ ఇదంతా కూడా మనోనుభూతులని మార్ధవం చేసి లలిత లలితమైనటువంటి భావనలకు చోటిచ్చి మనలో ఉన్నటువంటి అనేక కాఠిన్యాలను నెమ్మదిగా కరగించి మనలో ఉన్నటువంటి సహజ సంస్కారాన్ని ఉదాత్త శైలిలో బయటకు తీసుకొచ్చి తద్వారా వాక్కు, మన చూపు, మన చేత అన్నీ కూడా సమాజహితం అయ్యేట్లుగా ఉండాలి తప్ప సమాజానికికీడు కలిగించే రీతిలో ఉండకూడదు. కనుక ఈ సంస్కరణ ఎక్కడ జరగాలి? ఈ మహిషాసురుడు ఎప్పటి వాడు అంటే ఎప్పటి వాడు కాదు ఎప్పటికీ ఉండేవాడు. మానవ జన్మ ఎత్తిన మనసు మనో మృగం అంటాడు. ఆ మనో మృగం ఎక్కడ మనం కదంబవనం దాకా వెళ్ళినప్పటికీ అనేక ఉపాసనలు చేసి భక్తి మార్గంలో పతాక స్థాయికి వెళ్ళి నేను విజ్ఞానాన్ని దాటుతున్నటువంటి వేళ ఆ కదళీవనంలో కదంబవనము కదళీవనము అక్కడి దాకా వెళ్ళిన మనో మృగము పొంచి చూస్తూ ఉంటుంది. అహంకరించమంటుంది, హుంకరించమంటుంది. నువ్వు ఇంతటి వాడివి, అంతటి వాడివి అంటుంది. అవునా? అవును కాబోలు అనుకోకూడదు. ఆ క్షణంలోనే ఈ ప్రపంచం ఎంత జేజేలు కొట్టినా, ప్రపంచం ఎంత ఉదాత్తంగా మనల్ని భావన చేసినా మన దారిని మనం నెమ్మదిగా, విశ్రాంతంగా, ప్రసన్నంగా, ప్రశాంతంగా, హాయిగా, సరళంగా, సూటిగా, గంభీరంగా, ఉదాత్తంగా మన జీవితాన్ని మనం నడుపుకోవాలి. ఇది నిత్య స్పురగా మారాలి. మహర్నవమి నాడు మనం చేయవలసినటువంటిది ఏమిటంటే నిత్య స్పురకి శ్రీకారం చుట్టాలి. ఏమి స్పుర? ఒకే ఒక్క స్పుర. నేను ఎందుకు వచ్చాను? వచ్చి నేను ఏం చేస్తున్నాను? నేను చేస్తున్న దాని వలన నాకు, నా చుట్టూ ఉన్న ప్రపంచానికి, సమాజానికి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ ఏదైనా కీడు కలుగుతున్నదా? కనీసం ఏదైనా మేలు కలుగుతున్నదా? కడగా నేను వచ్చి చేయవలసినది ఏమిటని అనేక ప్రశ్నలను వేసుకుంటూ ఒక్కొక్క ప్రశ్నకి జవాబు వెతుక్కుంటూ, సంశయాలని వినిర్మూలనం చేస్తూ, సందేహాలను పటాపంచలు చేసుకుంటూ, సమాధానాలు పొందుతూ, సమాధాన పడకుండా, సమాధాన పడటం అంటే compromise కావటం. సమాధానం పొందటం అంటే జీవితంతో adjust కావటం. ఇవన్నీ కూడా ఉపాసనా మార్గంలో కూడా సరళమైనటువంటి మాటలు. వేదాంత భాష, ఆ పరిభాష వేరు. మహర్నవమి నాడు అమ్మవారు మనకు చెప్పేది ఇదే. నీలో ఉన్న మహిషాసురుణ్ణి నీవు గమనించు. నీకు ఆగ్రహం కలిగిందా? ఎందుకు కలుగుతున్నదో విచారించు. గట్టు తెలియకుండా ఆనందం ప్రవహిస్తున్నదా? కారణం ఏమిటో తెలుసుకో. నీకు ఆశ ఉండాలి, ఆశయం ఉండాలి, ఆదర్శం ఉండాలి. అంతే కానీ, దురాశ ఉండకూడదు, పేరాశ ఉండకూడదు, నిరాశ ఉండకూడదు. ఈ మూడు గనుక ఉన్నట్లయితే ఆ మూడు దుర్దశ వైపు దారి తీస్తుంది గనుక ఎప్పటికప్పుడు నీవు నిత్య స్పురలో ప్రతిక్షణం అంటే నిద్ర లేచినప్పటి నుంచి మళ్ళీ పడుకొని మళ్ళీ నిద్ర లేచే వరకు కలలో, ఇలలో, మెలకువలో అంటే జాగ్రదవస్థలో, స్వప్నావస్థలో, సుషుప్తిలో అన్ని వేళలా నిత్య స్పురతో ఉండాలి. అదే మనకు మహర్నవమి ఆ... ఉపదేశించేటువంటి మార్గం. ఆ నిత్య స్పుర ఏ జీవి యందు ఉంటుందో, ఎవరు దానిని ఒక అత్యద్భుతమైన ఆధ్యాత్మిక సాధనా మార్గంగా ఎంచుకుంటాడో, ఎవరైతే దానిని పట్టుకొని దానిని తన జీవితాన్ని గడుపుతూ తన తోటి వారందరినీ కూడా ఉదాత్తమైనటువంటి మార్గంలోకి తీసుకు వెళుతూ ఉంటాడో, ఎవడు ఆగ్రహాన్ని నిరోధించుకోగలడో, నిగ్రహించుకోగలడో, నిర్మూదించుకోగలడో, ఆశా నిరాశ పేరాశలను దాటగలడో, ఎవరు తన యందు ఉన్నటువంటి అనేకమైనటువంటి భావనలన్నింటినీ కూడా సమన్వయం చేసుకుంటూ ప్రపంచానికి హితము చేయని ప్రతిదానినీ వర్జిస్తూ అంటే వదిలిపెడుతూ, ప్రపంచానికి కావలసిన శక్తిని ఇవ్వటానికి మరొక దైవీ శక్తిని సముపార్జించుకుంటూ, సద్భావన ద్వారా, సదాచారం ద్వారా, సమ్యక్ సంకీర్తన ద్వారా, సత్సంగం ద్వారా, సత్సాంగత్యం ద్వారా, సదాలోచన ద్వారా మానవుడు ప్రతిక్షణము ఆ నిత్య స్పురని తన యందు రగిలించుకుంటూ ఉండాలి. ఎందుకంటే మాయ, అజ్ఞానము, అహంకారము, అవిద్య, అస్పష్టత ఇవన్నీ నివురు అంటే బూడిద ఒక నిప్పు మీద ఎట్లాగైతే ఆవరించి ఉంటాయో నివురు కప్పి ఉంటాయి. ఆ నివురుని ప్రతిరోజూ నిత్య స్పురతో ఊదుతూ ఉండాలి. అప్పుడు లోపల ఉన్నటువంటి జ్ఞాన కళిక ఏదైతే ఉన్నదో అది విరాజమానం చెంది మనల్ని ఆ స్పురలో నుంచి మనం సన్మార్గం వైపు ఎలా నడవాలి, ఏం నడిపిస్తే అది సన్మార్గం అవుతున్నది, దేని ద్వారా మనం మన జీవితాన్ని ప్రసన్నమయము హాయితో కూడినటువంటి స్థితిని ఆ... కల్పించుకొని ఎలా జీవించగలమో నేర్పుతుంది గనుక మహర్నవమి నాడు చేయవలసిన ఉపాసనా మార్గం ఒకటే. మనము నిత్య స్పురని ఒక అధ్యాత్మ సాధనగా చేసుకోవాలి. తద్వారా జీవితాన్ని మళ్ళీ redefine చేసుకోవాలి, refine చేసుకోవాలి, క్షాళన మొదలు పెట్టాలి. అమ్మవారి యొక్క మన శక్తి ఎలాగూ చాలదు. వ్యక్తి తన శక్తిని చాలదు అని అనుకున్నప్పుడు సమాజం యొక్క శక్తిని కూడా తీసుకోవాలి. తన శక్తి, వ్యవస్థ యొక్క శక్తి ఈ రెండూ చాలనప్పుడు దేనిని ఆశ్రయించాలంటే నిత్యమూ, సత్యమూ, శాశ్వతమూ, వినిర్మలమూ, అఖండమూ, అచ్యుతమూ, చిద్ఘనమైనటువంటి దైవీ శక్తిని మనం ఆవాహన చేసుకోవాలి. అంటే ఆ దైవీ శక్తి ఒకటి ఉన్నదని మనం విశ్వసించాలి. నమ్మకం పెంచుకోవాలి. దానిని ఈ ఈశ్వర స్వరూపంగా భావన చేసి తద్వారా మంత్ర తంత్ర యంత్రాత్మకమైనటువంటి ఒక భావనా స్థితిలో మనం గనుక అమ్మవారిని ఉపాసన చేయగలిగినట్లయితే ఈ తొమ్మిది రోజులలో నవమి అనేదాని యొక్క ప్రత్యేకత నిత్య స్పురగా పదే పదే ఎందుకంటున్నాం అంటే పురాణ గాథ వేరు, ఆ ప్రవచనం వేరు కానీ విశ్లేషణాత్మకమై మన జీవితానికి వినియోగపడేటువంటి ఒక సాధనా మార్గం కావాలి. సాధన అంటే ఏమిటి? అన్నీ సాధనలే. నిజానికి ఏది ఒక వ్యక్తికి సాధ్యమో అది సాధన అవుతున్నది. దానిని ఆధారం చేసుకొని అసాధ్యమైన దానిని సుసాధ్యం చేసుకుంటూ తనను తాను పునర్నిర్మాణం చేసుకుంటూ ప్రతిరోజూ తాను ఎక్కవలసిన మెట్లు, వెళ్ళవలసిన దారి, చేరవలసిన గమ్యం వీటన్నింటికీ లక్ష్యలక్షణాలు రెండింటిని జోడించుకొని ముందుకు సాగాలి గనుక అటువంటి స్థితి కోసమై మనం నవమి నాడు అమ్మవారిని ఉపాసన చేయాలి. అందువలన ఇది మహర్నవమై మహానవమై ఉంటున్నది. మళ్ళీ ఇక్కడ నవమి అంటే కొత్త కాదు అని అర్థం. తొమ్మిది అని ఒక అర్థం. నిజానికి ఏదీ కొత్త కాదు. ఏది మనం సనూతనంగా కనిపిస్తున్నామో లేదా ఇప్పుడే ఒక యాభై ఏళ్ళ క్రితం అరవై ఏళ్ళ క్రితం లేదా ఒక డెబ్భై ఏళ్ళ క్రితం ఈ ప్రపంచంలోకి వచ్చాము మనం చాలా కొత్త వాళ్ళం అని అనుకుంటుంటే మనం కొత్త వాళ్ళంగా కనిపించే పాత వాళ్ళం. పాత వాళ్ళంగా కనిపించే కొత్త వాళ్ళం. అంటే ఏది సనూతనంగా కనిపిస్తున్నదో అది సనాతనమై ఉన్నది. సనాతనము అంటే Eternal గా ఉన్నది. కాలాద్యవిచ్ఛిన్నంగా ఉన్నది. కాల ప్రమాణాన్ని కాల పరీక్షని నెగ్గి మానవుడు అనేకమైనటువంటి గట్లు దాటి దాటి వచ్చి ఇదిగో ఈ స్థాయికి వచ్చి ఇక్కడ నేనేమిటి? ప్రపంచం ఏమిటి? ఈ ప్రపంచ నిర్మాణకర్త ఎవరు? కారకుడు ఎవరు? ప్రేరకుడు ఎవరు? చోదకుడు ఎవరు? ప్రచోదకుడు ఎవరు? అనేటువంటి అనేకమైనటువంటి ఆంతరంగికమైనటువంటి ప్రశ్నలన్నింటికీ కూడా సమాధానాన్ని పొందుతూ ఉపనిషన్ మార్గం వైపు ఉపనిషన్ మార్గం అంటే ఉపనిషత్తులు బోధించిన మార్గం అని ఒక అర్థం. రెండవది ఉప దగ్గరగా నిషత్తు కూర్చొని ఎవరికి దగ్గరగా మనకు మనం దగ్గరగా కూర్చోవాలి. మనకు మనం దూరంగా కూర్చవటం అలవాటైపోయిన ఈ కాలంలో కాసేపు మనతో మనం కూడి ఉండాలి. కూడి మనల్ని మనం విశ్లేషించుకోవాలి. సంభావన చేయాలి. ఆశ్లేషణ చేయాలి. సమాశ్లేషణ చేయాలి. ఇవన్నీ కూడా మనల్ని మనం అర్థం చేసుకునేటువంటి ఒకానొక స్థితి కోసమే మహర్నవమి నాడు అమ్మవారి యొక్క శక్తిని మనం మరొక్కసారి ఆవాహన చేసుకొని మహానవమి నాటి నుంచి మరొక కొత్త రూపాన్ని కొత్త భావాన్ని కొత్త శక్తిని వినూత్నమైనటువంటి శక్తిని సంతరించుకొని మన గమ్యం వైపు వడివడిగా అడుగులు వేయాలి. ఆ అడుగులు వేయటానికి కావలసినటువంటి శక్తిని జగజ్జనని అయినటువంటి అమ్మవారు మనకు సంపూర్ణంగా అనుగ్రహించు గాక. [అవుట్ ట్రో మ్యూజిక్]