⁂
No transcript for this section.
Transcript begins at 0:00.
[ఇంట్రో మ్యూజిక్] సనాతనమైన, వైదికమైన, ఆర్షమైన, భారతీయమైనటువంటి ఒక ధర్మంలో యోగ చాలా ప్రధానమైనటువంటిది. "యోగః చిత్తవృత్తి నిరోధకః" అని పతంజలి మహర్షి చేసిన ఒక సూత్రం. ఏమిటి ఈ చిత్తము? దీని సంస్కారం ఏమి? వీన్నీ కాస్త విచారణ చేసినట్లయితే మనకి యోగము లేదా యోగా ఈ రెండిటికీ కొద్ది చిన్న స్వల్పమైన తేడా ఉన్నప్పటికీ కూడా యోగా ద్వారా చిత్తవృత్తులను నిరోధించుకోవటానికి అవకాశం ఉన్నదని, చిత్తవృత్తులు గనుక నిరోధింపబడినట్లయితే దాని పేరు యోగా అని ఈ సూత్రం యొక్క అర్థం. మరి ఈ చిత్తం అంటే ఎక్కడ ఉన్నది? మనం ఉన్నాం. మనకి అందరికీ ఏడు శరీరాలున్నాయి. పైకి కనిపించే ఒక్క శరీరం మాత్రమే కాదు. పైకి కనిపిస్తున్నది ఇది స్థూల శరీరం. రెండవది స్వప్నావస్థలో సూక్ష్మ శరీరం. తెలతెలవారుతున్నటువంటి వేళ కల మెలకువ కానటువంటి పరిస్థితిలో సుషుప్తిలో మనకి కారణ శరీరం కనిపిస్తుంది. అంటే స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు. ఈ మూడింటితో పాటు మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము నాలుగు. ఈ నాలుగు ముందున్న మూడు కలిపినట్లయితే మొత్తం ఏడు శరీరాలు. దీన్ని తను సప్తకము అంటారు. ఈ తను సప్తకం యొక్క స్థితిని అన్ని అనుభవించి దాటినవాడు దేనిని పొందుతాడు అంటే ఆత్మని అనుభవంలోకి తెచ్చుకుంటాడు. దానికే ఆత్మానుభవం అని, ఆత్మానందం అని మనం పేరు పెట్టుకుంటాం. ఇందులో మనస్సు వేరు, చిత్తము వేరు. ఎట్లా అంటే మనస్సు ఇప్పుడు పుట్టేది. ఈ క్షణాన పుట్టేది. తాత్కాలికమైనటువంటిది. ఎన్నో సంవత్సరాలుగా గూడు కట్టుకొని అనేక జన్మ జన్మాంతరాలుగా వచ్చేది మనస్సు కాదు. కానీ మనం అనేక జన్మలు ఎత్తి వచ్చాం. "బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే" అని ఒక మాట భగవద్గీతలో. అంటే అనేక జన్మలు ఎత్తావు, అవి దాటి వచ్చావు, ఇప్పుడు జ్ఞానాన్ని గురించి కాస్త మాట్లాడుకుందాం అంటున్నాడు యోగేశ్వర కృష్ణుడు. అంటే మనందరం కూడా అనేక జన్మలు దాటి వచ్చాం. మరి ఈ జన్మలో ఆ జన్మలన్నింటిలో ఏవైతే మిగిలిపోయి ఉన్నాయో, ఏ ఏ వృత్తులు, ఏ ఏ ఆలోచనలు, ఏ ఏ సంస్కారాలు, ఏ ఏ భావాలు, ఏ ఏ తలపులు దాగి ఉన్నాయో, మిగిలిపోయి ఉన్నాయో ఒక జన్మ నుంచి మరొక జన్మకి అవి ఆ ప్రస్థానం చేస్తాయి, మనతో పాటు వస్తాయి. అందుకనే కాళిదాసు "భావస్థిరాని జననాంతర సౌహృదాణి" అన్నాడు. భావాలు ఎట్లా నిలబడిపోయి ఉంటాయి, జన్మాంతరాలుగా మనతో వస్తూ ఉంటాయి అని అంటే జన్మలు ఉన్నాయి అని, అందులో కొన్ని భావాలు ఉండిపోతాయని, కొన్ని అయిపోతాయని, కొన్నింటిని మనం అనుభవిస్తామని చెప్పకనే చెప్తూ ఉంటే, ఈ మనస్సు అనేది ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితికి ఒక సంఘటనను బట్టి, ఒక సందర్భాన్ని బట్టి ఆవేశము, కావేశము, ఆనందము, ఆరాటము, పోరాటము, కామాటము ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. అది ఆ మనస్సు ఆలోచనల సమూహమై ఆ క్షణాన మనస్సుగా పిలవబడుతూ ఉన్నది. అంటే మనస్సు అప్పటికప్పుడు పుట్టేది, అప్పటికప్పుడు పోయేది. ఎందుకు? మనమే ఉన్నాం. ఈ క్షణాన చాలా ఆనందం అనుభవిస్తాం. మరుక్షణం ఎందుకో తెలియని ఒక దిగులులో కూరుకుపోతాం. ఇది మనం కూరుకుపోవటంలా, అది మనస్సు యొక్క లక్షణం. మన ఆలోచనా రీతిలో ఏర్పడినటువంటి ఒక పారిశ్రామిది. దాన్నలా పక్కన పెడితే బుద్ధి మనకుండేటువంటి ఇంటలెక్ట్, మనకున్నటువంటి ప్రజ్ఞ, మనకున్న తెలివితేటలు. ఈ తెలివితేటలు ఏమిటి? అవి ఈ జన్మలోనే ఏర్పడినవి. మళ్ళీ అవి కూడా సందర్భాన్ని బట్టి ఆ అపాయంలో ఉపాయము, ఆ తప్పించుకోవటము, ఒప్పించుకోవటము, నొప్పించకుండా ఉండటము, మెప్పిస్తూ ఉండటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇది బుద్ధి విశేషమైనటువంటిది. ఈ రెండింటిని దాటి చిత్తము అని ఉన్నదే, ఈ చిత్తము ఎలాంటిది అంటే ఇప్పుడు అనుకున్నాం కదా అనేక జన్మలు ఎత్తి వచ్చామని, ఆ అనేక జన్మలలో ఏర్పడి మిగిలిపోయి తీరని, మనల్ని ఇంకా వదలని, ఏవైతే-- ఇంగ్లీష్ లో దాన్ని ఏమంటాం అంటే Traits and Tendencies అంటాం. మనకుండేటువంటి మిగిలిపోయిన కొన్ని గుణాలు. అవి మంచి చెడు రెండుగా ఉంటాయి. అవి ఎలా ఉంటాయి అంటే ఆకాశంలో గగన గగనాంతరాలలో విహారం చేసేటువంటి ఒక గరుడ పక్షి భూమండలం మీద పచ్చగడ్డి మధ్యలో నరయాడుతున్నటువంటి ఒక ఆకుపచ్చ పాముని అక్కడి నుంచి చూసి ఎలా ఒక్కసారిగా వాలి తన గోళ్లతో పట్టుకొని ఏకాంతంలో ఒక కొండ మీదకు వెళ్లి దాన్ని తింటుందో అలాగే అనేక జన్మలుగా మనం ఏర్పరచుకున్నటువంటి విషయాలన్నీ కూడా విషయగతమైనటువంటివన్నీ కూడా ఇప్పటికీ వృత్తులుగా ఏర్పడతాయి. ఆ వృత్తులుగా ఏర్పడ్డటువంటి లక్షణాలు ఏర్పడతాయి. ఆ లక్షణాలు చాలా బలీయంగా ఉంటాయి. ఎంత బలీయం అంటే మనల్ని వదిలిపెట్టలేనంత బలంగా ఉంటాయి అవి. ఆ గరుడ పక్షి ఎట్లాగైతే పట్టుకున్నదో జన్మాంతరాలుగా మనం తెచ్చుకున్నవన్నీ కూడా ఈ జన్మలో ఒక చిత్తముగా ఏర్పడి ఆ చిత్తానికి కొన్ని వృత్తులు ఉంటాయి. అంటే మనకు కూడా ఒక మాట ఉంది, ఒక విషయం ఉంది. ఏంటంటే చిత్తం వచ్చినట్లు చేయండి అని. అంటే చిత్తము మనకు ఏదో చెబుతుంది, చిత్తం ఏదో చెప్పదు. ఈ రెండింటిలో మనం ఉండాలి. ఏది కావాలో, ఏది మంచిదో, ఏది సమాజహితమో, ఏది ధర్మబద్ధమో, ఏది సచ్ఛాత్మకమో, ఏది మోక్షానికి దారితీస్తుందో అంటే మోహక్షయం లేకుండా మానవుడిని జీవిం-- ఆ జీవితాన్ని సాగించేట్లుగా ఎలా చేస్తుందో దానిని గనక గమనించుకున్నట్లయితే ఈ చిత్తవృత్తులన్నీ కూడా నిరోధింపబడాలి. చిత్తం వచ్చినట్లుగా ఉండటానికి వీల్లేదు. ఉదాహరణకి చిత్తం వచ్చినట్లుగా కారు నడపకూడదు.చిత్తం వచ్చినట్లుగా సమాజంలో జీవించకూడదు, చిత్తం వచ్చినట్లుగా ఏకాంతంలో బతకకూడదు, చిత్తం వచ్చినట్లుగా ఎవరితోనూ సంబంధాలు మానవ సంబంధాలు అలా పెట్టుకోకూడదు అంటే ఇక్కడ చిత్తము చెప్పినట్లుగా చేయటానికి వీలు లేదు. చిత్తము ఇంత బలమైనటువంటిది కాబట్టి దానికున్న వృత్తులు కూడా బలీయమైనటువంటివి, బహుముఖీనమైనవి అనేక రకాలు అనేక పారశ్వాలతో కూడి ఉంటుంది గనుక దానిని నిరోధించగలిగితే, నిరోధిస్తే చిత్తవృత్తులు నిరోధించబడితే దాని పేరు యోగ. ఈవేళ ప్రాపంచికంగా భారతీయ ధర్మంలో ప్రధానమైనటువంటిది యోగ. ఏమిటి యోగ అంటే అది కేవలం శరీరానికి సంబంధించింది కాదు. అది శరీరము, మనస్సు, ఆత్మ. శరీరం ద్వారా అనుభవించాలి, మనస్సు ద్వారా అనుభూతి చెందాలి, ఆత్మలో స్థిమితమై ఉండాలి ఇది body mind and soul relation అంటాడు. మనది కూడా అదే మనస్సు శరీరమే లేకపోతే ఈ మాట్లాడేది ఎట్లా? వినేది ఎట్లా? నడిచేది ఎట్లా? శాస్త్రాలు చదివేది ఎట్లా? ఇవన్నీ చేసి-చేసి మనం ఏం చేయాలంటే ఇదిగో ఈ చిత్తవృత్తులు నిరోధించబడిన ట్లయితే ఏమవుతుంది అంటే దీంట్లో అష్టాంగ యోగాలు అని ఉన్నాయి. ఈ అష్టాంగ యోగాల ద్వారా జీవుడు తనను తాను సంస్కరించుకొని అనేకమైనటువంటి సోపానాలు ఎక్కి ఎక్కి కడగా తనను తాను ఎరుగు ఎరుకలోకి వెళ్తాడు. ఇది అష్టాంగ యోగం. దీనిలో చాలా ప్రధానమైనటువంటిది ప్రాణాయామం. యోగాలో పైకి కనిపించేది శరీరము ద్వారా చేసేటటువంటి కొన్ని విన్యాసాలు కనిపిస్తాయి. ఈ విన్యాసాలు అన్నీ ఏమిటంటే మన శరీరంలో మనకు తెలియకుండానే ఒక pressure, ఒక friction అది గాఢతగా ఏర్పడి ఉన్నప్పుడు దానిని సడలింపాలి. బిగువు సడలించి శరీరాన్ని సాకృతిగా ఆనందాకృతిగా మార్చుకొని మన మనస్సుని అధీనం చేసుకుని మన బుద్ధి ద్వారా అంటే వివేకము, విచక్షణ ద్వారా ప్రతి విషయాన్ని స్థూలంగా, సూక్ష్మంగా అర్థం చేసుకుని దాన్నన్నింటినీ కూడా నడిపించటానికి యోగ అనేటువంటి ప్రక్రియ ఏదైతే ఉన్నదో ఆ యోగ ప్రక్రియ ద్వారా శరీరం మాధ్యం ఖలు కర్మ సాధనం, శరీరం మాధ్యం ఖలు ధర్మ సాధనం. ధర్మబద్ధమైన కర్మలు చేయాలి అంటే ఇదిగో ఈ శరీరం కావాలి. వేదాంతులు అంటారు ఈ శరీరము తుచ్ఛము, నీచము, బుద్బుదము, నీటి మీద బుడగ ఎప్పుడు పోతుందో అని. నిజమైనప్పటికీ పోయేదాకా అది నిజంగా బుడగగానే ఉంటుంది. మనం కూడా అంతే పోయే దాకా ఇలాగే ఉండాలి, చైతన్యంతో ఉండాలి, యోగ స్థితిలో ఉండాలి. మనసేకం కర్మణ్యేకం వచసేకం మహాత్మనః. ఏదన్నామో అది ఆలోచన చేశామో దానిని ఆచరించాలి. అదే మాటగా మాట్లాడాలి. ఈ మూడింటి యొక్క సమన్వయం కూడా యోగాలో ఒక భాగం. ఇదంతా ఎందుకని భారతీయ సిద్ధాంతం చెప్పింది అంటే, ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మానవ జన్మ దొరకటమే చాలా దుర్లభం. ఎంతో పుణ్యం చేస్తే తప్ప, ఎన్నెన్ని మంచి పనులు చేస్తేనో తప్ప, ఎంతో స్వాధ్యాయం చేస్తే తప్ప, ఎంతో లోలోతులకు వెళ్లి మునిగి బయటికి వస్తే తప్ప, ఈ జన్మ రాదు గనుక జన్తూనాం నరజన్మ దుర్లభం. జంతువుకి మానవ జన్మ ఇవాళ వచ్చి రేపు పొద్దున రాదది. అనేక జన్మలు దాటగా దాటగా ఇదిగో ఈ జన్మ వచ్చింది మనకి. దీంట్లో అన్ని శబ్దాలు పుట్ట నిశ్శబ్దమందు, అన్ని యుగాలు మొదలాయ యోగమందు, అన్ని జన్మల చివరాయ నరజన్మ, హరయ నారాయణాన్వేషితమ్ము. చిట్టచివరి జన్మగా ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో సమున్నతమైనటువంటి జన్మ మానవ జన్మ కాబట్టి మానవ జన్మలో చాలా ప్రధానంగా చిత్తము భూమిక వహిస్తుంది కాబట్టి దానివలన మన గతి, ధృతి, ఆధృతి, మనం నడిచే విధానం, మన లక్ష్యగమ్యాలు నిర్దేశింపబడి ఉన్నాయి గనుక చిత్తాన్ని గనుక మరమ్మత్తు చేసుకోగలిగినట్లయితే, దాని వృత్తులను గనుక మనం ఆపగలిగినట్లయితే, నిరోధించగలిగినట్లయితే, నిగ్రహించగలిగినట్లయితే, సంహారము చేయగలిగినట్లయితే అది యోగ అనబడుతుంది గనుక మన ఆలోచన ఒక వ్యక్తితో ఆగదు. కుటుంబం మీద పాకి సమాజంలోకి ప్రవహించి దేశాన్ని ముంచెత్తుతుంది గనుక ఈ ఆలోచనలు, ఈ వాసనలు, మూల వాసనలు వీటన్నింటినీ కూడా సమన్వయం చేసుకునేటువంటి ఒక ఉదాత్త భూమిక, దాని పేరు యోగ. దానికి శరీరం మనకి పరమేశ్వరుడు ఇచ్చినటువంటి గొప్ప ఆయుధం. ఈ ఆయుధాన్ని రోజు పదును పెట్టుకోవాలి. రోజు దాన్ని వాడాలి. ఆ వాడాలి అంటే కష్టం చేయాలి. కర్మానుబంధి మనుష్యులకే కర్మ చేయటానికి వచ్చాం. కన్నుమూసే దాకా ఏదో కర్మ, ఏదో పని చేస్తూనే ఉండాలి. దానికి చిత్తము ద్వారా గనుక కర్మలన్నీ కూడా చేసినట్లయితే ఎటువంటి చిత్తము? వృత్తులు నిరోధింపబడిన చిత్తము. అది ఎలా జరుగుతుంది? యోగా వలన జరుగుతుంది. కనుక ఈ ఒక దేశాన్ని గురించి గాని, ఒక సమాజాన్ని గురించి గాని, కుటుంబాన్ని గురించి గాని అవన్నీ పక్కన పెట్టిన వ్యక్తిగా మనం కూడా చిత్తవృత్తి నిరోధకం చేసుకొని యోగాతో ఉంటే ఆశ ఉండదు, నిరాశ ఉండదు, దురాశ ఉండదు, పేరాశ ఉండదు, దుర్దశ కూడా ఉండదు. ఈ దుర్దశ రాకుండా ఉండాలి, సమాజంలో ఉదాత్త మానవ స్థాయిలో మనం సంచారం చేయాలి అంటే యోగ అనేటువంటి ప్రక్రియని చక్కగా ఆధారం చేసుకొని ప్రాణాయామం ద్వారా, ధ్యానం ద్వారా, ప్రత్యాహారం ద్వారా ఇవన్నీ కూడా మనకి విధివిధానాలు ఏర్పడి ఉన్నాయి. కేవలం యోగ శరీరానికి సంబంధించిన బహిరంగ విన్యాసం కాదు. ప్రాణ ఆయామం వలన అంటే మనలో ఉన్నటువంటి ఏ ప్రాణశక్తి మన అన్నం ద్వారా మనం తెచ్చుకుంటున్నామో అది మన సర్వమైనటువంటి అంగముల యందు సర్వావయములందు ఒక ప్రవాహ వేగంతో సమానంగా వెళ్ళాలి గనుక వీటన్నింటినీ కూడా నిగ్రహించగలిగిన సమర్థవంతమైనటువంటి ప్రక్రియ ఏది అంటే అది యోగ అవుతున్నది. అటువంటి యోగ భారతదేశం గురుస్థానంలో ఉండి, ఈవేళ విశ్వగురు స్థానంలో ఉండి ప్రపంచ దేశాలన్నింటికీ కూడా ఈ యోగా ద్వారా ప్రాణాయామం వంటి అనేకమైన ప్రక్రియలన్నీ కూడా చెప్తూ మానవుడు మానవుడిగా ఉదాత్త మానవుడిగా సంస్కారగతమైన మానవుడిగా జీవించగలిగినటువంటి ఒక స్థితిని అనుగ్రహిస్తుంది గనుక మనం యోగాన్ని ఆశ్రయించాలి. యోగ వేరు, యోగము వేరు. యోగము అంటే communion. సర్వవ్యాపకమైనటువంటి భగవంతుడితో, భగవద్భావనతో కూడి ఉంటే దాని పేరు యోగము. దాని పేరే యుక్తము. కానీ యోగ అనేటువంటిది ఒక యోగ ప్రక్రియ యోగశాస్త్రంలో. ఈ యోగాన్ని ఆ భగవంతుడు మనందరికీ బోధించినటువంటి భగవద్గీతని జాతి, మత, వర్గ, వర్ణాలకు అతీతంగా ఏమన్నాడంటే ఇది యోగశాస్త్రము అన్నాడు. అంటే కర్మయోగం, భక్తియోగం, జ్ఞానయోగం. ఈ మూడింటి ద్వారానే మానవుడు సమున్నతుడు అవుతాడు. కానీ ఆ మార్గం ఎలా పట్టుకోవాలి, ఎలా నడవాలి, ఎలా జీవితాన్ని చక్కగా, అందంగా ముగించుకోవాలి అని చెప్పినటువంటి భగవద్గీత యోగశాస్త్రం అవుతున్నది గనుక ఇవాళ ప్రపంచమంతా కూడా యోగా అనేటువంటి పవిత్రమైనటువంటి దివ్య విధానం ద్వారా తమని తాము సంస్కరించుకొని తమ సమాజాన్ని కూడా సంస్కరణ వైపు నడిపిస్తుంది గనుక యోగాకి ప్రణామం చేస్తున్నాం.